Former CJI Justice NV Ramana Book : జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల నిజమైన ప్రధాన న్యాయమూర్తి అని సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశంసించారు. సమాజంలోని విభిన్న వర్గాల ప్రజల్లో ఆయనకు ఉన్న ప్రజాదరణ మరెవరికీ లేదన్నారు. న్యాయ వ్యవస్థను సామాన్యులకు చేరువ చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగాల సంకలనంగా రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కొనియాడారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన ''నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్, ఏ జడ్జ్ స్పీక్స్'' పుస్తక విడుదల కార్యక్రమం దిల్లీలో ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కలిసి జస్టిస్ బీఆర్ గవాయ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జస్టిస్ ఎన్వీ రమణతో తన అనుబంధాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ గుర్తు చేసుకున్నారు. ఆయన తీర్పుల్లో, ప్రసంగాల్లో మానవత్వం, సహానుభూతి, సంవేదనశీలత ప్రతిబింబిస్తాయని కితాబిచ్చారు. ఆయన తన గుమస్తాలకు కూడా ఇళ్లు కట్టించి తన వద్దే ఉంచుకున్న సహృదయులు అని కొనియాడారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో తొలిసారి ఆన్లైన్కు వెళ్లిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సంజయ్కిషన్కౌల్తో పాటు కూర్చొనే అదృష్టం కలిగిందన్నారు. చిట్టచివర ఉన్న వ్యక్తికి కూడా న్యాయవ్యవస్థ అందుబాటులో ఉండాలని ఆయన పరితపించారని చెప్పారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మార్గాన్నే అనుసరిస్తానని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.