Union Minister Bandi Sanjay Review : తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెఫీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తులకు సంబంధించి మార్చి నెలాఖరులోపు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేసి లెక్క తేల్చాలని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీస్(అంటే దేశ విభజన జరిగిన తర్వాత భారత్ నుంచి విడిపోయి పాకిస్థాన్, చైనా వెళ్లిపోయిన వారి ఆస్తులు వివరాలు)పై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా కొత్వాల్గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్పై పురోగతి ఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు.
నెలాఖరులోగా సర్వే పూర్తి : ఏళ్ల తరబడి పొజిషన్లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదికను అందించాలని బండి సంజయ్ సూచించారు.