FIRING ON CONSTABLE IN PRISM PUB : హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపైకి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పబ్బులో ఉన్న పాత నేరస్థుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పబ్బులో పనిచేసే బౌన్సర్ల సాయంతో నిందితుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్రెడ్డి పాత నేరస్థుడు. చోరీలు చేయడంలో ఆరితేరిన ఇతడి మీద తెలుగురాష్ట్రాల్లో 80 వరకూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 16 చోరీ కేసులు ఉన్నాయిని పోలీసులు తెలిపారు. 2020లో విశాఖ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం నిందితుడిని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు విచారణ సమయంలో నిందితుడి చేతికి ఉన్న సంకెళ్లను పోలీసులు తొలగించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దుండగుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అప్పటి నుంచి ప్రభాకర్ పోలీసులకు చిక్కలేదు. అజ్ఞాతంలో ఉంటూనే చోరీలు చేస్తున్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధి మొయినాబాద్, నార్సింగి పోలిస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు ప్రభాకర్ ఎక్కువగా ఇంజీనీరింగ్ కళాశాలల్లో చోరీ చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పరీక్షలు, హాస్టల్ ఫీజులు కళాశాలల్లో ఉంటాయని తెలుసుకుని పక్కా పథకం ప్రకారం చోరీ చేస్తాడు. ఇటీవల నార్సింగి, మొయినాబాద్లో జరిగిన చోరీల్లో ఘటనస్థలిలోని వేలిముద్రల్ని విశ్లేషించగా పాత నేరస్థుడు ప్రభాకర్తో సరిపోలాయిని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడి కదలికల మీద పోలీసులు నిఘా ఉంచారు. సీసీ పుటేజీల ద్వారా ప్రయత్నించగా మాస్కులు, టోపీ ధరించి వెళ్తున్నట్లు గ్రహించారు. దోపిడీ చేసిన డబ్బుతో వారాంతాల్లో పబ్బుకు వెళ్తున్నట్లు గుర్తించి ఐటీ కారిడార్లోని అన్ని పబ్బుల్లోని సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫోటోలు ఇచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించామని పోలీసులు వెల్లడించారు.