Bonalu Celebrations at Shantiniketan School : గత నెల రోజులుగా వైభవంగా జరుగుతున్న బోనాల జాతర ఆదివారంతో ముగిసింది. నగరమంతా సందడిగా బోనాల పండుగ ఉత్సవాలు జరుపుకున్నారు. పసుపు లోగిళ్లు, పచ్చని తోరణాల బోనాల పండుగ భాగ్యనగరానికి సరికొత్త శోభను తీసుకువచ్చింది. హైదరాబాద్ హయత్నగర్లోని శాంతినికేతన్ పాఠశాలలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో బాలురు పోతురాజుల వేషాలతో సందడి చేయగా, బాలికలు బోనాలు ఎత్తుకుని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ జి.రాధాకృష్ణ, డైరెక్టర్ ఝాన్సీ రాధాకృష్ణ, పాఠశాల డీన్ ఫణిశ్రీ ప్రభంజని, ప్రిన్సిపల్ స్వరూప, వైస్ ప్రిన్సిపల్ రామాంజనేయులు పాల్గొన్నారు. విద్యార్థినిలతో పాటు టీచర్లు బోనమెత్తారు. స్థానిక ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అక్కడ బోనాలు సమర్పించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకే పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించామని ఉపాధ్యాయులు వివరించారు. పాఠశాలలో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.