CM Chandrababu Discuss With IT Employees : పేదింటి కుర్రాడు కష్టాన్ని నమ్ముకొని లక్ష్మీ కటాక్షం పొందాడు. ఏడాదికి రూ. 93 లక్షలు ప్యాకేజీతో ఉద్యోగం సాధించి కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించగలరని నిరూపించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం ఆ యువకుడు ఆశ్చర్యపరిచాడు. అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో చంద్రబాబు శనివారం ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజు యాదవ్ అనే యువకుడు తాను బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని చెప్పాడు. కటింగులన్నీ పోనూ నెలకు రూ.6 లక్షలు 37 జీతం వస్తోందని తెలిపాడు. ఎంత జీతం అంటూ మరోమారు చంద్రబాబు అడగ్గా ఏడాదికి రూ.93 లక్షల ప్యాకేజీ అంటూ సమాధానమిచ్చారు. ఆశ్చర్యపోయిన చంద్రబాబు ఆ యువకుణ్ని చప్పట్లు కొట్టి అభినందించాలంటూ అందర్నీ కోరారు. సభకు హాజరైన వారంతా కరతాళధ్వనులతో అభినందించారు.