జేడీ కు సాయం చేసేందుకే పదవికి రాజీనామా చేశా : కే.రాజగోపాల్

  • 6 years ago
Kuderu Rajagopal Resigned VC post of Sri Krishna Devaraya University for support former CBI JD Lakshminarayana.

అనంతపురం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కే.రాజగోపాల్ 2015 జూన్ 23వ తేదీన ఎస్కేయూ వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూన్ 22వ తేదీ నాటికి ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం వర్సిటీ ఉన్నతాధికారులు, ఉద్యోగులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. కాగా ఇటీవల డిగ్రీ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో విద్యార్థి, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఐదుగురు డిగ్రీ విభాగానికి చెందిన అధికారులను వీసీ సస్పెండ్ చేశారు.అలాగే గత కొంత కాలం క్రితం వర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని వర్సిటీలో చర్చ సాగుతోంది.
అయితే, రాజగోపాల్ త్వరలో రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వల్లే పదవీ కాలం ఇంకా రెండు నెలలు ఉన్నప్పటికీ రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. బలిజ (కాపు) సామాజిక వర్గానికి చెందిన రాజగోపాల్ త్వరలో పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేనపార్టీలో చేరే అవకాశం ఉందని వర్సిటీలో చర్చసాగుతోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి నడిచేందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ స్పష్టం చేశారు. కాగా,వ్యక్తిగత కారణాలతో వీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మూడురోజుల క్రితం ప్రకటించారు.
తనకు సహకరించిన పాలకమండలి, సిబ్బందికి కృతజ్ఞతలు రాజగోపాల్ తెలిపారు.సీబీఐ మాజీ జేడీ వీఆర్ఎస్ తీసుకున్నారని, ఆయన ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని చెప్పారు. ఆయనకు సాయం చేసేందుకే పదవికి రాజీనామా చేశానని, అయితే లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదని చెప్పారు. కాగా, ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ అయిన లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో తన విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న విషయం తెలిసిందే.

Recommended