పవన్ గుంటూరు పర్యటన : మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు !

  • 6 years ago
Janasena's chief Pawan kalyan will visit Guntur today. He will visit the families of the deceased of cholera. In this background, police made a strong security arrangements for his tour.


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. అతిసారంతో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించనున్నారు. అలాగే డయేరియా బాధితులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పవన్ కలవనున్నారని తెలిసింది. అతిసారం బారిన పడి గుంటూరులో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. మరోవైపు గుంటూరులో కలరా విజృంభణ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ముగ్గురు మంత్రులను ఆదేశించారు.
నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డున తొలిసారిగా జనసేన పార్టీ బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ మాట్లాడుతూ తాను అమరావతి సహజ పౌరుడినని...గుంటూరు జిల్లా వాసినేనని...అందుకు వివరణగా తాను బాపట్లలో పుట్టానని...తన తండ్రి కానిస్టేబుల్ గా మంగళగిరిలో పనిచేశారని, తాను మంగళగిరిలో పెరిగానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇదే సభలో పవన్‌ కళ్యాణ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భూములు తీసుకున్న వ్యవహారాల నుంచి లంక భూముల రైతులు ఎదుర్కొంటున్న అనేక స్థానిక సమస్యల గురించి ప్రస్తావించడం గమనార్హం. రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2 వేల ఎకరాల భూములు సరిపోయేవి. అలాంటిది 33 వేల నుంచి లక్ష దాకా పోతోందని పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆవిర్భావ దినోత్సవం సభ ప్రారంభం కాకముందే రాజధాని నుంచి వచ్చిన రైతులను సభా వేదిక వద్దకు రావాలని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.అలాగే తన ప్రసంగంలో గుంటూరు కలరా మరణాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు...విజయవాడలోని దుర్గగుడి పార్కింగ్‌ ఫీజుల అంశం, తెదేపా నాయకుల వాటాల వ్యవహారం ప్రస్తావిస్తూ స్థానిక స్పందన రాబట్టగలిగారు. దుర్గగుడి పార్కింగ్‌ ఫీజుల నుంచి కూడా తెదేపా ఎమ్మెల్యేకు వాటాలు పంపాల్సి రావటం దురదృష్టకరం అన్నారు.
ఈ నెల 18వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని, ఉగాది పండుగ ఇక్కడే జరుపుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటానికి కలిసి వచ్చే పార్టీలతో పార్టీ కార్యాలయంలో చర్చలు జరుపుతానని అన్నారు. ప్రత్యేక హోదా కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. జనసేనకు క్యాడర్ లేదు...బలం లేదు అని ఏవేవో మాట్లాడుతున్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చూపిస్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో స్థానికంగా ఉంటూ స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Recommended