Union Budget 2018: TDP MPs Hold Black Ribbon Protest

  • 6 years ago
TDP MPs Hold Black Ribbon Protest in Parliament Against Union Budget 2018

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో, రాష్ట్రంలోని టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఏపీ కోసం ధర్మపోరాటం చేస్తున్నామని చెప్పారు.
పార్లమెంటులో నిరసనలు కొనసాగించాల్సిందేనని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. నిరసనలు ఉధృతం చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోను తగ్గవద్దని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి లెక్కలేనప్పుడు మనం పోరాటం చేయాల్సిందేనని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని చంద్రబాబు అన్నారు. కాబట్టి పార్లమెంటులో తగ్గవద్దని చెప్పారు. విభజనకు లేని ఫార్ములా లోటు బడ్జెట్‌కా కావాలా అని మండిపడ్డారు. మనం విభజన సమయంలో ఇచ్చిన హామీలను అడుగుతున్నామని చెప్పారు.
మోడీ ప్రసంగంలో ఏమీ లేదని భావిస్తున్న చంద్రబాబు బీజేపీకి మరో షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలో అన్ని పార్టీలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించడం గమనార్హం. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలని కూడా ఎంపీలకు దిశానిర్దేశనం చేశారు. అంతేకాదు, అందరికీ అర్థమయ్యేలా ఏపీకి జరిగిన అన్యాయంపై బుక్ లెట్స్ పంచాలని చెప్పారు.
మనం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు. ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీలు అందరూ బలంగా మన వాయిస్ వినిపించాలని చెప్పారు. మన పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకు వెళ్లాలని చెప్పారు.

Recommended