తమిళనాడు తరహా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడపాలని బిజెపి ప్లాన్ !
  • 6 years ago
Andhra Pradesh CM and Telugu Desam chief Chandrababu Naidu is accusing BJP is playing Tamil Nadu type politics in the state. What is it?

తమిళనాడు తరహా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడపాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శిస్తున్నారు. ఆ రకమైన రాజకీయాలు తన వద్ద సాగవని కూడా ఆయన అంటున్నారు. చంద్రబాబు మాటలతో తమిళనాడు తరహా రాజకీయాలు అంటే ఏమిటనే ఆసక్తి నెలకొంది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో పెద్ద డ్రామానే జరిగింది. ముఖ్యమంత్రి కావాల్సిన శశికళ జైలు పాలయ్యారు. ఎదురు వర్గాలు ఒక్కటయ్యాయి.
ఆమె వర్గం ఛిన్నాభిన్నమైంది. ఆ వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న దినకరన్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఆర్కెనగర్ ఉప ఎన్నికలో మాత్రం ఆయన విజయానికి బిజెపి అడ్డుకట్టవేయలేపోయింది. కానీ, తిరిగి బలం కూడగట్టుకోవడానికి దినకరన్ వర్గం తీవ్రంగా ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైరి వర్గాలుగా ఉన్న పళనిసామి, ఓ పన్నీర్ సెల్వం ఒక్కటయ్యారు. ఇరువురు కూడా తొలుత శశికళ వర్గానికి చెందినవారే. శిబిరాలు మార్చి ఇరువురు కలహించుకున్నారు. కానీ బిజెపి చేసిన ప్రయత్నంలో ఇరువురు రాజీకి వచ్చి ఏకమయ్యారు. పూర్తిగా తమిళనాడు ప్రభుత్వం, అన్నాడియంకె కేంద్రం చెప్పు చేతల్లోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును దెబ్బ తీయడానికి బిజెపి వేసిన ప్లానేమిటనేది ప్రశ్న. కేసుల విషయం పక్కన పెడితే చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్‌లతో కలిసి బిజెపి రాజకీయం నడుపుతుందా అనేది ప్రశ్న. చంద్రబాబు అదే అంటున్నారు. తనను దెబ్బ తీయడానికి వారిద్దరిని బిజెపి వాడుకుంటోంందని ఆయన విమర్శిస్తున్నారు.
తమిళనాడులో ఇతర పార్టీలు ఎదగకుండా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బిజెపి అడ్డం పెట్టిందనే వాదన ఉంది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో రజనీకాంత్‌ను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలియదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని బిజెపి రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం వర్గాలంటున్నాయి.
Recommended